వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తా..: ట్రంప్‌

 దేశరాజధాని ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌  ముఖేశ్‌ అంబానీ, రతన్‌ టాటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా  తదితరులు హాజరయ్యారు.  భారతీయ కంపెనీల సీఈవోలతో ట్రంప్‌ ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.   'భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఆరేడు నెలల్లో ఒప్పందం కుదురుతుంది.  భారత పర్యటన ఎంతో ఆనందం కలిగించింది. భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం అమలు కృషి చేస్తాను.  రిపబ్లికన్లకు స్పష్టమైన ఆధిక్యం రావడంతో సంస్కరణలు చేసేందుకు  అవకాశం  వచ్చిందని' ట్రంప్‌ తెలిపారు.


'ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చాం.   మరోసారి నేను అమెరికా అధ్యక్షుడిని కావడం ఖాయం. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నేనే గెలుస్తా.   మేం విజయం సాధిస్తే మార్కెట్లు భారీగా పుంజుకుంటాయి.  సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది.   చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. కరోనాపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో  మాట్లాడాను. కరోనా విషయంలో చైనాలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్‌కు కష్టపడి పనిచేసే ప్రధాని ఉన్నారు. ఆయన చాలా మొండి వ్యక్తి.  మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు. 'అని  ట్రంప్‌ పేర్కొన్నారు.